ఏపీలో కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీ వ్యూహంతో ముందుకువెళ్తున్నారు. అనుమానితులందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తూ వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు సుమారు 5వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. సమగ్ర సర్వేల్లో గుర్తించిన 32 వేల మందిలో ఇప్పటికే 2 వేలమందికిపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని క్వారంటైన్ సెంటర్లలో ప్రస్తుతం 7,100మంది ఉన్నారు.
కాగా, ఇప్పటివరకు ఏపీలో 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 184 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక చికిత్స పొందుతూ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని మొత్తం 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోవిడ్ దవాఖానల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.