కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేశాయి. అయినప్పటికీ కరోనా కేసులు , మరణాలు తగ్గడం లేదు. రోజు రోజుకూ అంతకంత పెరుగుతూ ప్రభుత్వాలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
తాజాగా సింగపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాను ఎదుర్కొనేందుకు “లాక్డౌన్”ను జూన్ 1 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు దేశ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ ప్రకటించారు. మొదట మే 4 వరకు “లాక్డౌన్” ప్రకటించినప్పటికీ “కరోనా” కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళనకర పరిస్థితి నెలకొనడంతో మరో నాలుగు వారాల వరకు పొడిగింపు తప్పలేదన్నారు ప్రధాని. కాగా, సింగపూర్లో ఇప్పటివరకు 9,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11 మంది మృతిచెందారు.