ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి ఈ మహమ్మారి మెరుపుదాడి చేయనుందా..? వచ్చే శీతకాలంలోనే ఈ దాడి జరుగనుందా..? అంటే పలువురు వైద్యనిపుణులు మాత్రం ఔననే అంటున్నారు. వచ్చే శీతకాలంలో అమెరికాలో మరోసారి ఫ్లూ, కొవిడ్-19 విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ రోజుకు వందలు, వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటివరకు సుమారు 8లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 45వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కేవలం 60వేల లోపే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే అమెరికా దారుణంగా దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అమెరికాపై కొవిడ్-19 దాడి చేస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.