తెలంగాణ రాష్ట్రంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎడతేరిపి తేకుండా కష్టపడుతున్నారు.  ప్రజలంతా సురక్షితంగా ఇంటి పట్టున ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.  ఒక్క పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్యకార్మికులు మాత్రం తమ విధులు నిర్వహిస్తున్నారు.  తాజాగా సంజీవ‌య్య పార్కు ఎదురుగా ఉన్న డి.ఆర్‌.ఎఫ్ శిక్ష‌ణా కేంద్రంలో బుధ‌వారం శానిటేషన్, డిఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సామాజిక దూరం పాటిస్తూ భోజ‌నం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కె.టి.ఆర్‌ ప్రతి కార్మికుడిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొద్ది మందికి స్వ‌యంగా వ‌డ్డించారు. కుటుంబ స‌భ్యుల ఆరోగ్య ప‌రిస్థితిని, వారు ఏం చేస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు.  ప్రజల  ఆరోగ్యం చల్లగా ఉండేలా కృషి చేస్తున్న  వైద్యులు, పోలీస్, శానిటైజర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.  క‌రోనా నియంత్ర‌ణ‌లో విశిష్ట సేవ‌లు అందిస్తున్న శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్స‌హ‌కాల‌ను ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ ఇస్తున్నార‌ని గుర్తుచేశారు.

ప్ర‌జ‌ల కొర‌కు నిరంత‌రం ప‌నిచేసేవారిని ప్ర‌భుత్వం గౌర‌విస్తుంద‌ని పేర్కొన్నారు. వ‌ర్షాకాలం రాబోతున్నందున దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టుట‌కై ఇప్ప‌టి నుండే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎంట‌మాల‌జి విభాగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, డిప్యూటి మేయర్ మ‌హ్మ‌ద్‌ బాబా ఫసియుద్దీన్, ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, శానిటేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్‌రాజ్‌, సికింద్రాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: