ఏపీలో కరోనా వైరస్ అధికారవర్గాలకు చుక్కలు చూపిస్తోంది. ఎవరి నుంచి ఎవరికి ఎప్పుడు ఎలా సోకుతుందో అర్థంగాని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ అమలుకు పోలీసులు రాంత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆపదలో ప్రజల అవసరాలను తీర్చుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని స్వయంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న మహిళను విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఆమెకు కరోనా సోకి మృతి చెందినట్లు తేలిసింది. దీంతో అధికారవర్గాలు ఉలిక్కిపడ్డాయి.
వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సదరు మహిళను ఆస్పత్రికి తరలించినవారితోపాలు మొత్తం 25మంది పోలీసులను క్వారంటైన్కు తరలించారు. ఈ ఘటనతో పోలీస్వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదు కాగా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 821కు చేరింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లా 19, చిత్తూరు జిల్లా 6, కడప జిల్లా 5, ప్రకాశం జిల్లా 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురంలో 8కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 25కు చేరుకుంది.