మహారాష్ట్రలో కరోనా వైరస్ భయానక పరిస్థితులను సృష్టిస్తోంది.. సామాన్యులు, వైద్యులు, నర్సులు, పోలీసులు, జర్నలిస్టులు.. తాజాగా.. మంత్రికి కూడా కరనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. గృహనిర్మాణ శాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవహద్కు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తం అయిన 54 ఏళ్ల జితేంద్ర వైద్యచికిత్స కోసం థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంత్రి జితేంద్రకు చెందిన 15 మంది కుటుంబసభ్యులు కరోనా భయంతో ముందుజాగ్రత్త చర్యగా వారం రోజుల క్రితమే హోం క్వారంటైన్లోకి వెళ్లడం గమనార్హం. అంతేగాకుండా.. మంత్రి భద్రతా సిబ్బందిలో కొందరికి కూడా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పోలీసు అధికారి వల్ల మంత్రికి కరోనా వచ్చిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ నెల ప్రారంభంలో మంత్రి ముంబ్రా పోలీసుస్టేషనుకు వచ్చి అక్కడి సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ను కలిశారు. సదరు పోలీసు అధికారి తన స్వగ్రామమైన నాసిక్ కు వెళ్లగా అక్కడ ఆయనకు పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబ్రాలో 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియా దేశాలకు చెందిన తబ్లీగ్ జమాత్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా పోలీసులకు కరోనా వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఇక వీరు కలిసిన వారందరినీ క్వారంటైన్కు తరలించి పరీక్షలు చేస్తున్నారు.