తెలంగాణలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓపక్క వైరస్ నియంత్రణ చర్యలు వేగవంతంగా తీసుకుంటూనే.. మరోపక్క లాక్డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా మార్చ్, ఏప్రిల్, మే నెలలకు గానూ ఇంటి అద్దె వసూలు చేయవద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా జీవో కూడా విడుదల చేసింది.
అద్దెలు చెల్లించలేదన్న కారణంతో ఎవరినీ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇల్లు ఖాళీ చేయిస్తే వారు సరిహద్దులు దాటడం లేదా మరో ఊరికి వెళ్తారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. 3 నెలల తర్వాత అద్దె బకాయిలను ఎలాంటి వడ్డీ లేకుండా, వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఇంటి యజమానులకు సూచనలు చేసింది. బలవంతంగా అద్దెలు వసూలు చేసినట్లు, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులొస్తే శిక్షలు విధిస్తామని యజమానులను హెచ్చరించింది.
అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ లో దీన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణటక ప్రభుత్వాలు కూడా దీన్ని అమలులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాయట. వెంటనే దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.