దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రజలంతా సమైక్యంగా కరోనా కట్టడి కోసం కృషి చేయాల్సిన సమయంలో కొందరు మానవీయ విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని మీరా రోడ్డులో ఆన్ లైన్ లో నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో వస్తువులను తీసుకునేందుకు తిరస్కరించాడు. దీంతో మనస్తాపానికి గురైన డెలివరీ బాయ్ ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పాటు ఈ ఘటన ప్రభుత్వం, పోలీసుల దృష్టికి వచ్చింది. డెలివరీ బాయ్ తాను ముఖానికి మాస్క్ ధరించానని... చేతికి గ్లౌజులు వేసుకున్నానని... అన్ని రకాల రక్షణ చర్యలు పాటించానని... అయినా కూడా సరుకులు వద్దని కస్టమర్ తిరస్కరించాడని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సదరు కస్టమర్ ను అరెస్ట్ చేశారు. 
 
సోషల్ మీడియాలో ఒక మతస్థుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందని దుష్ప్రచారం జరుగుతూ ఉండటంతో కొందరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. థానే కోర్టు కస్టమర్ కు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని సమాచారం. కరోనా కష్ట కాలంలో మత వివక్ష చూపించడం దారుణమని డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: