కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరో దశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరి జలాలు... అక్కడి నుంచి రంగనాయక సాగర్లోకి కాలుమోపాయి. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్హౌజ్ వద్ద మోటర్లను రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ లు మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. నాలుగు మోటర్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు.
ఈసందర్భంగా సిద్దిపేటలోని శ్రీరంగనాయక స్వామికి మంత్రులు ఇద్దరు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ కు మంత్రులు చేరుకోనున్నారు. ఇప్పటికే అక్కడ జలపూజకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. కాగా రంగనాయక సాగర్ సర్జిపూల్ ద్వారా సిద్దిపేట, రాజన్న సిరిసిల్లలోని లక్షా 40 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది.