దేశంలో రెండో ఉద్దీపన ప్యాకేజీని ఖరారు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఈఏసీ చైర్మన్ బీబెక్ డెబ్రోయ్, ఈఏసీ సభ్యుడు సజ్జిద్ చెనోయ్, 15 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్కె సింగ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రతిన్ తదితర ఆర్థికరంగ నిపుణులతో చర్చించి ఖరారు చేయనున్నారు. పరిశ్రమలకు, పేదలకు, రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రెండో ఉద్దీపన ప్యాకేజీని ఫైనలైజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ ప్యాకేజీ ప్రకటన రాబోయే 24-48 గంటల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మొదటి ప్యాకేజీ కన్నా రెండో ప్యాకేజీ తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ రెండో ప్యాకేజీ పట్టణ, గ్రామీణ పేదలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా.. వలస కార్మికులు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.