కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన పేదలు, ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో పేదలను ఆదుకోవడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. నిత్యావసర సరుకులను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే.. కర్నాటకలో వృద్ధురాలైన మత్స్యకార్మికురాలు శారదక్క తన పెద్దమనసును చాటుకుంది. తన చుట్టుపక్కల వాళ్లు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయింది. తాను దాచుకున్న రూ.30వేల రూపాయలతో బియ్యం కొని సుమారు 140 పేద కుటుంబాలకు పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా ఆమెను ఉడిపి డిప్యూటీ కమిషనర్ జీ జగదీశా ఆమె ఘనంగా సత్కరించారు. ఆమె సేవాగుణాన్ని మెచ్చుకున్నారు. పని చేసి పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బులను ఆపదలో పేదల ఆకలితీర్చేందుకు ఖర్చు పెట్టడం గొప్పవిషయమని అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా ముందుకు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమెను సన్మానించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.