కరోనా వైరస్ అధికంగా ఉన్న నగరాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర బృందం శనివారం హైదరాబాద్ చే రుకుంది. గచ్చిబౌలి ఆస్పత్రిలో సదుపాయాలను కేంద్ర బృందం పరిశీలించింది. కాగా దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్స్పాట్ ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందం నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది.
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో కోవిడ్–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 1,500 బెడ్లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.