లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇండ్ల కే పరిమితం అయ్యారు. దీంతో పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ ఠాణాలో గురువారం నుంచి నేటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సిటీ సైబర్ ఠా ణాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గడిచిన నాలుగేళ్లలో ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొంటున్నారు.
గురువారం కేవలం 14 మంది మాత్రమే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీటికి కేసు నమోదు ప్రమాణాలు లేకపోవడంతో ఒక్క కేసూ నమోదు చేయలేదు. 2016 నుంచి పరిశీలిస్తే సెలవు దినాలు మినహా పని రోజుల్లో (లాక్డౌన్ సహా) ఇలా జరగడం ఇదే తొలిసారి. లాక్డౌన్ను పకడ్భందీగా అమలు చేస్తుండటంతో పాటు సైబర్ నేరగాళ్ల బారినపడి ఎవరూ భారీ మొత్తం నష్టపోకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.