అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశం. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి అటవీశాఖ అధికారి పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఏపీ పోలీసులు, అనేకమంది తమిళులను స్మగ్లర్లుగా భావించి వారిని కాల్చి చంపిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న కారణంగా తమిళ హీరో అయిన విజయ్ సేతుపతి ఈ పాత్రలో నటిస్తే తమిళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్ధేశంతో ఆయన ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడే మరో టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా లాక్డౌన్తో షూటింగ్ వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ ప్రారంభం అవుతుందో తెలియని కారణంగా విజయ్ డేట్లు సర్దుబాటు చేయలేనని తప్పుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే విజయ్ పాత్రలో మళ్లీ తమిళ నటుడినే తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం తాజాగా బాబీ సింహాతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మరో హీరోయిన్ పాత్రలో నివేదా థామస్ కనిపించనున్నారు.