ఇప్పుడు ప్రపంచంలో రెండే రెండు అంశాలు హాట్ టాపిక్స్.. ఒకటి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్.. మరొకటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్య పరిస్థితి. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు కిమ్ హాయిగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా... ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు చైనా వైద్య బృందం కూడా ఉత్తర కొరియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ బృందంలో గుండె సంబంధిత, శ్వాసకోశ వైద్య నిపుణులు ఉన్నారు. ఈ నెల 12న కిమ్కు కార్డియో వాస్కలర్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో అక్కడి ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆయన సోదరికి బాధ్యతలు అప్పజెప్పేందుకు రంగం సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఉత్తరకొరియా ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అస్సలే ఒప్పుకోవడం లేదు.. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతోంది. ఇదిలా ఉండగా.. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అస్సలు నమ్మడం లేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నట్లు తమకు సమచారం ఉందని చెబుతున్నారు.