కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదవడం గమనార్హం. అమె రికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది.
కరోనాతో అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా ఆంక్షల్ని ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆర్థికం, ఆరోగ్యం... ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నెమ్మదిగా లాక్డౌన్ ఆంక్షలను సడలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే జార్జియా, ఒక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో ఆంక్షల్ని పూర్తిగా సడలించారు. కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ పేర్కొంటోంది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన స్పష్టం చేశారు.