దేశంలో కరోనా నానాటికీ విజృంభిస్తుంది. గత నెల దేశంలో మొదలైన కరోనా వ్యాప్తి మెల్లి మెల్లిగా తన ప్రతాపాన్ని చూపిస్తూ పోతుంది. తాజాగా దేశంలో అత్యధిక కేసులు మహరాష్ట్రలో నమోదు అవుతున్నాయని అంటున్నారు. ఇండియాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 25 వేలను దాటేసిన వేళ, అందులో 20 శాతం కేసులు... అంటే 5 వేలకు పైగా కేసులు ఒక్క ముంబయి మహానగరంలోనే నమోదు కావడం అధికారులను కలవరపెడుతోంది. వైరస్ సోకి 57 సంవత్సరాల హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ గణపత్ పెందూర్కర్ మరణించారని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
శనివారం నాడు పుణెలో నలుగురు కరోనా కారణంగా మరణించారు. పుణెలో ఒకరు పింప్రి-చించావాడ్, ధూలే, సోలాపూర్ ప్రాంతాల్లో ఒక్కొక్కరూ మరణించారు. శనివారం నాడు మహారాష్ట్రలో కొత్తగా 811 కేసులు నమోదుకావడంతో, రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. కొత్త కేసుల్లో 602 ముంబైలోనివే కావడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 21 కేసులు వచ్చాయి.
మొత్తం మరణాల సంఖ్య 323 కాగా, ముంబైలో 191 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో హై రిస్క్ ఉన్న వారిని గుర్తించి, వారికి చికిత్సలపై సలహా, సూచనలు అందించడం... మరణాల సంఖ్యను తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది వైద్య నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను నియమించింది.