కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేందుకు జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయగా విశేష స్పందన లభిస్తున్నది.
బియ్యం, భోజనం, అంబులెన్స్ తదితర సాయం కోసం విరివిగా ఫోన్లు వస్తున్నాయి. గడచిన నెల రోజుల్లో 8158 ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతేకాదు, ఈ కం ట్రోల్ రూం ద్వారా హోమ్ క్వారంటైన్లలో ఉన్నవారి ఆరోగ్యంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే గత మార్చి 22న జీహెచ్ఎంసీ కార్యాలయంలో 040-21 11 11 11 నంబరుతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ మాజీ ఉన్నతాధికారి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కంట్రోల్ రూమ్లో జీహెచ్ఎంసీతోపాటు రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, పోలీసు తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. కంట్రోల్ రూం ప్రజల సమస్యలు తీర్చడంలో వివిధ శాఖల మధ్య వారధిగా పనిచేస్తున్నది.