కరోనా వైరస్ కారణంగా ఎవరు మరెవరినీ నమ్మడం లేదు.. అమ్మో కరోనా..! ఎవరిని ఎవరికి వస్తుందో.. తెలియని భయానక పరిస్థితి. అందుకే ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు నిత్యం చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే.. మనం వాడుతున్న వస్తువులన్నింటినీ శానిటైజ్ చేస్తున్నాం. చివరికి కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల కిందట ఓ గ్రామంలో రోడ్డుపై కనిపించిన కరెన్సీ నోట్లను చూసి భయపడిన గ్రామస్తులు వాటిని బొందలో వేసి మరీ కాల్చివేశారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరులో విజయలక్ష్మీ జనరల్ స్టోర్స్ యజమాని కొత్త నర్సింహారావు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. షాపులో వస్తువులు కొన్నవారు ఇచ్చిన కరెన్సీ నోట్లను ఎలక్ర్టికల్ కుక్కర్లో నీటి ఆవిరిలో ఉడికించి శానిటైజ్ చేస్తున్నాడు. ఆవిరిలో కరెన్సీ నోట్లను ఉడికించడం ద్వారా వాటిపై ఉన్న క్రిములు చనిపోతాయమని, అప్పుడు మనం క్షేమంగా ఉండవచ్చునని ఆయన చెబుతున్నాడు. కరోనా నుంచి తప్పించుకోవడానికి జనం ఇలా శతకోటి ఉపాయాలు పడుతున్నారన్నమాట.