కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ప్రపంచ దేశాలన్నీ తలమునకలయ్యాయి. వైరస్ ను కనిపెట్టేందుకు, పని పట్టేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే మరో రెండు మూడు వారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదివారం ప్రకటించింది.
ఆక్టోబర్ నాటి కల్లా వ్యాక్సిన్ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపింది. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శటీ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వారు ప్రపంచ వ్యాప్తంగా ఏడు సంస్థలతో జట్టు కట్టగా..భారత్ నుం చి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకూడా ఈ ప్రయత్నాల్లో భాగమైంది. ఇక ఆక్సఫర్డ్ బృందానికి డా. హిల్ నేతృత్వం వహిస్తున్నారు.
కాగా.. వ్యాక్సిన్ విషయమై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ తొలి ఆరు నెలల్లో రోజుకు 50 లక్షల డోసుల చప్పున వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తరువాత క్రమంగా కోటి డోసుల వరకూ ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాం’ అని సంస్థ సీఈవో ఆదర్ పూనావాల తెలిపారు.