దేశంలోని పలు రాష్ట్రాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కరోనా కేసుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 27,982 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలోనే 8068 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
గుజరాత్, ఢిల్లీ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ లో 3301 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 2918 కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగానే అమలు చేస్తున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
రాజస్థాన్ లో 2185 కేసులు నమోదు కాగా మధ్యప్రదేశ్ లో 2096 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మే 3వ తేదీ తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించనున్నట్లు మోదీ ఈరోజు సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారని సమాచారం. ఈ ఐదు రాష్ట్రాల్లో కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: