కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఏపీ సీఎం జగన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టే అవకాశం లేదని, దానితో మన ప్రయాణం చాలాకాలం పాటు కొనసాగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని, మరో ఏడాదికాలం పట్టవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం సాయంత్రం విలేకరులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి, తీసుకుంటున్న చర్యలపై వివరాలు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి అప్రమత్తంగా ఉంటూ.. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని అన్నారు. సుమారు 81శాతం మందికి ఇళ్లలో ఉంటేనే కరోనా వైరస్ సోకడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా సోకితే అంటరానితనంగా చూడొద్దని, కరోనా బాధితులపట్ల వివక్ష చూపొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 56 లక్షల మంది అవ్వాతాతలకు పింఛన్ అందించామని, రేషన్ కార్డుదారులందరికీ వెయ్యి రూపాయలు అందించామని అన్నారు. రోగ నిరోధక శక్తి పెంచేలా ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కట్టడి విషయంలో భారత్ కన్నా ఏపీ చాలా మెరుగైన స్థానంలో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో 10లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తుంటే ఏపీలో సగటున 1396 చేస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చితే.. ఏపీలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని.. ఏపీలో మాత్రం కేవలం 1.61శాతం మాత్రమే కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని ఆయన తెలిఆరు. ప్రతీ రోజు 5వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటివరకు 74555 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఆయన తెలిపారు. అందుకే వైరస్ బారినపడకుండా సుమారు 86శాతం రాష్ట్రం గ్రీన్ జోన్లోనే ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
ప్రతీ పదిలక్షల జనాభాకు 1396 పరీక్షలు ఏపీలో చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయని, ఇందులో 63 రెడ్జోన్లో ఉన్నాయని, 53 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, మిగతా 559 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. క్వారంటైన్ సెంటర్లలో అన్నివసతులు కల్పించామని, 9 వీఆర్డీఎల్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 44 ట్రూనాట్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రధానంగా గ్రామ వలంటీర్లు చాలా గొప్పగా పనిచేస్తున్నారంటూ వారికి హ్యాట్పప్ చేప్పారు. 14410 టెలీ మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఆర్థిక లోటు ఉన్నా.. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.