ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిఘి జమాత్ సభ్యులు గొప్పమనసు చాటుకున్నారు. పదిమంది సభ్యులు ప్లాస్మా దానం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఢిల్లీలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేసి, మిగతా వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే.. వైద్యులు మాట్లాడుతూ.. దేశభక్తిని చాటే సమయం ఆసన్నమైందని, ప్లాస్మా దానం చేయడానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ పిలుపును అందుకున్న తబ్లిఘి జమాత్కు చెందిన పదిమంది సభ్యులు ప్లాస్మాను దానం చేశారు. గత మార్చిలో తబ్లిఘి జమాత్లో నిర్వహించిన కార్యక్రమానికి విదేశీయులతోపాటు దేశం నలుమూలల నుంచి ముస్లింలు హాజరుకాగా.. అనేకమంది కరోనా వైరస్బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ కేసులు పెరిగిపోయాయి. ఢిల్లీలో చికిత్స పొందిన తర్వాత పలువురుజమాత్ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, వైద్యులు ఇచ్చిన పిలుపుమేరకు వారు ప్లాస్మాను దానం చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు.