భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 4గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,543 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 29,435 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే.. 24 గంటల్లో 684 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా.. 62మంది మరణించారని వెల్లడించింది. ఇక దేశంలో రికవరీ రేటు ఇప్పుడు 23.3శాతం ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ప్లాస్మా థెరపీ గురించి పలు కీలక వివరాలను వెల్లడించారు. దేశంలో ప్లాస్మా థెరపీ ప్రయోగాత్మకంగా జరుగుతోందని, ప్లాస్మా థెరపీ కరోనాకు చికిత్స కాదని ఆయన అన్నారు. ప్లాస్మా థెరపీ పరీక్షించబడుతోంది, అయితే, దీనిని కొవిడ్ -19 చికిత్సగా ఉపయోగించవచ్చని ఎటువంటి ఆధారాలు లేవని, ఈ చికిత్సపై అధ్యయనం చేయడానికి ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అధ్యయనం కొనసాగుతోందని అగర్వాల్ చెప్పారు.