కరోనా వైరస్.. ఈ ప్రపంచం ఊహించని ఉప్పెన. చైనాలోని వుహాన్నగరం కేంద్రంగా పుట్టిన ఈ వైరస్ మనదాకా రాదులే అని ప్రపంచ దేశాలు అనుకునేలోపే చుట్టుము్ట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రెండులక్షలమందికిపైగా ప్రజల ప్రాణాలను బలితీసుకున్న కరోనా మానవాళిని వదిలిపెట్టే పరిస్థితులు ఏమాత్రమూ లేవన పరిశోధకులు చెబుతున్నారు. తాత్కాలికంగా ప్రభావం తగ్గినా.. ఇక దాని పలకరింపులు ప్రతీయేటా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఏటా వచ్చే సీజనల్ ఫ్లూ వ్యాధుల్లాగే ఇది కూడా విజృంభిస్తుందని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాతోజీన్ బయాలజీ డైరెక్టర్ జిన్ క్వి తెలిపారు. అమెరికా అత్యున్నత వైద్యాధికారి ఆంటోనీ ఫాసీ కూడా ఈ వ్యాధి ప్రతి శీతాకాలంలో తిరిగి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మొదట్లో ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించేవి. కానీ.. ఇప్పుడు వైరస్ సోకినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. దాదాపుగా భారత్లో 80శాతానికిపైగా లక్షణాలు కనిపించని కేసులే ఉన్నాయని, వైరస్ విస్తరణ అసాధారణ వేగంతో ఉందని భారత వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది రోగుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించటంలేదని దాంతో పరీక్షలు చేయించుకోవటంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారు వైరస్ వ్యాప్తికి వాహకులుగా మారే ప్రమాదం ఉందని అదే జరిగితే వైరస్ మళ్లీ విజృంభిస్తుందని గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ దిలీప్ మౌలాంకర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో అనూహ్యంగా కేసుల సంఖ్య పెరుగుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.