వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2021 ఆతిథ్య హక్కులను భారత్ చేజేతులా పోగొట్టుకుంది. ఆతిథ్య ఫీజు చెల్లించడంలో జాతీయ బాక్సింగ్ సమాఖ్య విఫలం చెందడంతో ఈ టోర్నీని నిర్వహించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. ఇక ఆ టోర్నీ నిర్వహణ మరో దేశానికి వెళ్లిపోయింది. నిజానికి.. 2017లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఆతిథ్య నగరం ఢిల్లీ గతేడాది డిసెంబర్ 2వ తేదీ లోపు సుమారు 30కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కట్టలేదు. దీంతో ఆ ఒప్పందం రద్దు అయింది. అంతేగాకుండా.. భారత్ ఇప్పుడు ఏకంగా 500 డాలర్ల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో భారత జాతీయ బాక్సింగ్ సమాఖ్య తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం ఏమిటని పలువురు క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ బాక్సింగ్ సమాఖ్య పనితీరుతో క్రీడాకారులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారని, ఇది మంచి పరిణామం కాదని అంటున్నారు. అయితే.. ఇక్కడే మరోవాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కరోనా మనల్ని ఎప్పుడు వీడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్యం కల్పోయినందుకు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.