ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఇటీవల ఏపీ గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడినట్టు వార్తలు రాగా, తాజాగా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేస్తున్న అటెండర్ కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో తుది నిర్ధారణ కోసం నమూనాను వైరాలజీ ల్యాబ్కి పంపారు. అటెండర్ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు.
విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నానికి, ఆయన భద్రతా సిబ్బందికి, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరికి సంబంధించిన పరీక్ష ఫలితాలు గత అర్ధరాత్రి రాగా, అందరికీ నెగటివ్ అని తేలినట్టు వైరాలజీ ల్యాబ్ అధికారులు తెలిపారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఫలితాలు వెలువడగా అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.