భారత్లో మొత్తం 736 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 452 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉంది. అయితే.. మొత్తంగా చూస్తే.. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అయ్యేది కేవలం 15 జిల్లాల్లోనే కావడం గమనార్హం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 30వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. ఈ 15 జిల్లాల నుంచే సుమారు 19వేల కేసులు ఉండడం గమనార్హం. ఇందులోనూ ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, ఇండోర్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ పదిహేను జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు జిల్లాలకు చోటు దక్కింది.
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఇప్పటివరకు హైదారబాద్లో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల శాతం 3.30గా ఉంది. ఇక కర్నూలు జిల్లాలో 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో మరణాల శాతం 2.71గా ఉంది. ఈ 15 జిల్లాల్లో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగితే.. భారత్దేశం వైరస్పై విజయం సాధించినట్టేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.