ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జర్మనీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహింస్తోందంటూ బుధవారం జర్మనీలో డాక్టర్లు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు. వైద్యపరికరాలను అడ్డుగా పెట్టి ఆందోళన చేపట్టారు. వెంటనే తమకు అత్యవసరమై పీపీఈ కిట్లను పంపిణీ చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగినందున కొరత నెలకొందని, దీనిని వైద్యులు అర్థం చేసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ.. ఇప్పటికే 133 మిలియన్ మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని, వాటిలో 10 లక్షల మాస్కులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే.. దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసినందున మరో 15 మిలియన్ మాస్కులను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇంకా చాలాకాలంపాటు వైరస్తో మనం పోరాడాల్సి ఉందని హెచ్చరించారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 1.5 లక్షలుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 6000 మంది మరణించారు.