కరోనా వైరస్ కట్టడిలో ఆదర్శరంగా నిలుస్తున్న కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి అందరూ బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో ఫేస్ మాస్క్లు ధరించడం కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని వారికి రూ .200 జరిమానా విధించనుంది. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏకంగా రూ.5 వేల భారీ జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్లాత్ మాస్క్లు, తువ్వాళ్లు, చేతి రుమాళ్లు కూడా ఫేస్ మాస్క్లుగా ఉపయోగించవచ్చునని సూచించింది.
పదేపదే చెబుతున్నా.. పలువురు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బయటకు వస్తుండడంతో కేరళ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కేరళలో ఈరోజు కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలు, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 495 పాజిటివ్ కేసులు నమోదు ఉన్నాయి. ఇందులో 123 యాక్టివ్ కేసులు ఉన్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.