కరోనాపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం రచిస్తోంది. మహమ్మారిని అంతం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు రానున్నారు. మే 3వ తేదీన దేశవ్యాప్తంగా లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కరోనాపై పోరుకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు మే 4వ తేదీ నుంచి లాక్డౌన్ అమలులో మరిన్ని సడలింపులు ఉంటాయని ఇప్పటికే కేంద్రహోంశాఖ సమాచార ప్రతినిధి ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం నుంచి కొవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తుందని, అవి మే 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే.. ఆ మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ సడలింపులకు సంకేతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులు, కూలీలు, యాత్రికులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇక మే 4 నుంచి దేశంలో దాదాపుగా కీలక రంగాల కార్యకలాపాలు సాగేలా సడలింపులు ఇచ్చేఅవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలూ, పైసలూ రెండూ ముఖ్యమేనని, ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే కరోనా అంతానికి ఎలా పోరాడాలో ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేస్తారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి.. దేశవ్యాప్తంగా కేవలం 15 జిల్లాల్లో మాత్రమే వైరస్ ప్రభావం ఉంది. అందులోనూ ఏడు జిల్లాల్లోనే మరింతగా తీవ్రత ఉంది. ఈ జిల్లాల్లో కొవిడ్-19ను నియంత్రించగలిగితే.. భారత్ విజయం సాధించినట్టేనని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నిబంధనలు అమలు చేస్తూనే గ్రీన్జోన్ ప్రాంతాల్లో దాదాపుగా అన్నిరంగాల కార్యకలాపాలు సాగేలా మోడీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
New guidelines to fight #COVID19 will come into effect from 4th May, which shall give considerable relaxations to many districts. Details regarding this shall be communicated in the days to come.#coronavirus update#StayHomeStaySafe@PMOIndia @HMOIndia @MoHFW_INDIA
— Spokesperson, Ministry of home Affairs (@PIBHomeAffairs) April 29, 2020