కేరళలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని కాసరగోడ్లో ఎలక్ట్రానిక్ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ఇంటర్వ్యూ చేసిన కాసరగోడ్ కలెక్టర్, కలెక్టర్ డ్రైవర్, గన్మెన్, వ్యక్తిగత సిబ్బందినందరినీ క్వారంటైన్కు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో మీడియా వ్యక్తులకు వచ్చిన మొదటి కేసుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నిన్న బుధవారం పది మంది సాధారణ జనంతో పాటు, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది, టీవీ రిపోర్టర్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ సుజిత్బాబు మాట్లాడుతూ... తాను ఏప్రిల్ 19వ తేదీన సదరు జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు వెల్లడించారు. జర్నలిస్టుతో పాటు అతడితో పనిచేసిన కెమెరామెన్, డ్రైవర్, ఇద్దరు ఇతర సిబ్బందిని కూడా క్వారంటైన్కు తరలించామని ఆయన పేర్కొన్నారు. సదరు మీడియా సంస్థ తన సిబ్బందికి సామాజిక దూరం పాటిస్తూ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.