బాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత శనివారం ఇర్ఫాన్ ఖాన్ తల్లి మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిని చివరి చూపుకూడా చూడలేకపోయారు. ఆ తర్వాత రెండు రోజులకే ఇర్ఫాన్ఖాన్ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా కనీసం అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదని పరిస్థితి. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే.. బాలీవుడ్ను మరో విషాదం అలుముకుంది. గురువారం ఉదయం ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్ పొందుతూ మృతి చెందారు.
ఈ వార్తతో బాలీవుడ్ దిగ్భాంత్రికి లోనైంది. రిషీకపూర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో రిషీకపూర్ హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండో కుమారుడు. రిషీకపూర్ మొన్నటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 2018లో రిషీకపూర్కి క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. ఇక భార్య, బాలీవుడ్ నటి నీతూసింగ్ ఆయన వెంటే ఉంటున్నారు. యువహీరో రణబీర్ కపూర్ రిషీ కుమారుడే. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.