బాలీవుడ్ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్ పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ దిగ్భాంత్రికి లోనైంది. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రిషీకపూర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో రిషీకపూర్ హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండో కుమారుడు.
2018లో రిషీకపూర్కి క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్లోనే ఉంటూ చికిత్స చేయించుకున్నారు. ఇక భార్య, బాలీవుడ్ నటి నీతూసింగ్ ఆయన వెంటే ఉన్నారు. యువహీరో రణబీర్ కపూర్ రిషీ కుమారుడే. కాగా, రిషీకపూర్ మొన్నటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రిషి కపూర్.. ఏప్రిల్ 2 నుంచి తన అకౌంట్లో ఎలాంటి పోస్టులు కూడా చేయలేదు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్లో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తున్నారు. రిషీకపూర్ మృతితో ఆ సినిమా షూటింగ్స్కి బ్రేక్ పడినట్టే..!