కరోనా వైరస్ కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలవడమేకాదు.. అనేక అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్తో ఎక్కడికక్కడ ప్రజలు చిక్కుకుపోయారు. వలసకార్మికులు, కూలీలు, విద్యార్థులు ఇలా.. అనేమంది చిక్కుకుపోయారు. ఈ క్రమంలో అనేకమంది సొంతూళ్లకు కాలినడక ప్రయాణించారు. నడిచీనడిచీ అలసిపోయి దారిమధ్యలోనే అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి ఘటనలు కన్నీళ్లు పెట్టించాయి. తాజాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా రామసముద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బెంగళూరు నుంచి కాలినడకన రామసముద్రానికి వచ్చాడు.
ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై రెండు రోజుల కిందట మరణించాడు. అయితే.. కరోనాతో చనిపోయాడని అనుమానించి గ్రామస్తులు ఆ యువకుడి మృతదేహాన్ని ఊరిబయటపెట్టారు. అనంతరం విషయం తెలియగానే అధికారులు అక్కడికి చేరుకుని మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత యువకుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. అనారోగ్యంతో మరణించినా.. కరోనానేమోనని అనుమానపడాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.