కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసిస విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి ఇచ్చింది. తాజాగా.. ముఖ్యమంత్రి జగన్ మరికొన్ని మినహాయింపులను ఇచ్చారు. లాక్డౌన్ నుంచి కల్లుగీత వృత్తికి కూడా మినహాయింపును ఇచ్చింది. లాక్డౌన్ నుంచి గీతకార్మికులకు సడలింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భౌతికదూరం పాటిస్తూ కల్లుగీత వృత్తిని కొనసాగించడంపై మార్గదర్శకాలను జారీ చేసింది. నిజానికి.. లాక్డౌన్తో ఏపీలో వేలాదిమంది గీతకార్మికులు ఉపాధికి దూరమయ్యారు.
ఈ తరుణంలో వారికి లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో గీతకార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.