ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. తాజాగా అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఈరోజు ఐజీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐజీ కుమారుడు నెల రోజుల క్రితమే కెనడా నుండి అనంతపురంకు వచ్చాడు. యువకుడికి కరోనా నిర్ధారణ కావడంతో వెంటనే కరోనా ఆస్పత్రికి తరలించారు. ఐజీ కుమారుడికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో కలకలం రేగింది. 
 
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మూడు కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈరోజు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ లో ఐజీ కుమారుడికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపింది. యువకుడు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఐజీ కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేయించుకున్నారు. యువకుడికి కరోనా ఎలా సోకిందో తెలియాల్సి ఉంది. 
 
యువకుడు ఏయే ప్రాంతాలలో తిరిగాడనే వివరాలను, అతని సన్నిహితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈరోజు నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 1403 కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: