కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతింటున్నాయి. పెద్దపెద్ద కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగులను తీసివేయడమో.. జీతాల్లో కోత విధించడమో చేస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల శాతం అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా.. భారత దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించింది.
ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కంటే తక్కువున్న వారికి కోతలు ఉండవని, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత విధించింది. కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని పూర్తిగా వదులుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.