ఎవరి జీవితంలోనైనా పెళ్లి జీవితాంతం గుర్తుంచుకునే ఓ మధుర జ్ఞాపకం. మరి కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు పెద్దలు.. మరి ఇప్పుడు చెప్పుకునే జంట విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే మా పెళ్లిని ఆపడం ఏ కరోనా వల్ల కూడా కాదంటూ శపధం చేసింది ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ జంట. హమీర్పుర్లోని పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి అనే యువకుడికి మహోబా జిల్లాలోని పునియా గ్రామానికి చెందిన వెంకీ వివాహం నిశ్చయమయింది. ఇంతలో పెళ్లికి వీల్లేదంటూ లాక్ డౌన్
వచ్చింది కానీ వాళ్లు పెళ్లిని వాయిదా వేసుకోలేదు.
వధూవరులిద్దరూ ఒంటరిగానే అయినా సరే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ విధంగా పెళ్లి కావాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోసం ఏప్రిల్ 27న తన సైకిల్ తొక్కుతూ ప్రయాణం సాగించాడు. అలా 100 కిలోమీటర్ల తొక్కుకుంటూ వెళ్లగా ఏప్రిల్ 28 నాటికి పెళ్లి కూతురు గ్రామానికి చేరుకున్నాడు. ఇంకేముంది... అప్పటివరకూ పడ్డ కష్టాల్ని మరిచి అక్కడే బాబా ధ్యానిదాస్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అదే సైకిల్ పై బుధవారం నాడు వధువుని ఎక్కించుకుని తన స్వస్థలానికి చేరుకున్నాడు. ఈ పెళ్లి గురించి కల్కు మాట్లాడుతూ... "నా పెళ్లి కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాను... కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు"... అని పేర్కొన్నాడు.