కరోనా వైరస్ వ్యాప్తి అంతుచిక్కడం లేదు.. తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తుంది.. ఇంతలో మళ్లీ ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో టెన్షన్ మొదలవుతోంది. తాజాగా.. తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు రోజులపాటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదు అయ్యాయి. పదిలోపే కేసుల సంఖ్య ఉంది. హమ్మయ్య.. ఇక మనం కరోనా బారి నుంచి బయటపడినట్టేనని అనుకుంటుండగానే.. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వంలో, అధికారులు, ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 568గా ఉంది. కాగా కోవిడ్-19 కారణంగా ఇవాళ ముగ్గురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 28కి చేరింది. వ్యాధి నుంచి కోలుకుని ఇవాళ 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 442 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే.. మొన్ననే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మే 8వ తేదీ తర్వాత తెలంగాణ కరోనా రహితంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 5వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ.. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.