ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళన చెందు తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అంతకంతకూ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో ప్రభుత్వం పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో నమోదైన 60 కరోనా కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 25 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఈ జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 411కు చేరింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభన ఆగటం లేదు. గడచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్ను పరీక్షించగా 60 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1463కు చేరింది. ఇందులో 403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో కరోనా వల్ల ఇప్పటిదాకా 33 మంది మృత్యువాత పడ్డారు.