ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్పై పోరులో ప్రపంచదేశాలు దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వైరస్ను దక్షిణ కొరియా విజయవంతంగా నియంత్రించింది. గత రెండుమూడు వారాలుగా ఒక్క కొత్తకేసు కూడా నమోదు కాలేదు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది దక్షిణ కొరియా. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా బయటపడేసేందుకు గొప్ప హరిత లక్ష్యాన్ని చేపట్టిందని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.
ఇందులో భాగంగా దక్షిణ కొరియాలో బొగ్గు ఆధారిత పరిశ్రమలన్నీ మూసేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశంలో 10,765 కరోనా కేసులు నమోదు కాగా 247 మంది మాత్రమే మరణించారు. గురువారం నాలుగు కరోనా కేసులు నమోదైనప్పటికీ వారిలో కొరియావాసులు ఎవరూ లేరని ఆ దేశ వ్యాధి నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని గుటెర్రెస్ పిలుపునివ్వడం గమనార్హం.