విజయవాడ వైఎస్సార్ కాలనీలో రేషన్ ఇప్పించలేదన్న కోపంతో సాదిక, మేరీ అనే ఇద్దరు మహిళా వలంటీర్లపై స్ధానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తొలుత సాధిక అనే వలంటీర్ తమకు రెండో విడత రేషన్ ఇప్పించలేదన్న కోపంతో బ్లాక్ 157 వాసులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడికి దిగడంతో స్థానికంగా కలకల రేపుతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వలంటీర్ మేరీపైనా కూడా స్థానికులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గర్భవతి అని కూడా చూడకుండా జనం మేరీపై దాడి చేయడంతో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమపై స్ధానికులు దాడి చేయడంపై వలంటీర్లు టూటౌన్ పోలీసు స్టేషన్ కు ఫోన్ ద్వారా చెప్పారు.
అయితే.. 100కి డయల్ చేయాలని చెప్పి టూటౌన్ పోలీసులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వలంటీర్లు చివరికి 100కి డయల్ చేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి నిందితులపై కేసు నమోదు చేశారు. అప్పటికే స్ధానికుల దాడిలో ఇద్దరు మహిళా వలంటీర్లు గాయపడ్డారు. దీంతో దాడికి నిరసనగా ఇతర వలంటీర్లతో కలిసి వీరంతా స్ధానిక వార్డు సచివాలయం వద్ద నిరసనకు దిగారు. వలంటీర్లపై జరుగుతున్న దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.