దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ తరువాత రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలంలో వివిధ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని జిల్లాల వారీగా అంటే రెడ్ (హాట్స్పాట్) ), గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోకి వచ్చే జిల్లాల్లో గణనీయమైన సడలింపులను ఇచ్చింది.
కొత్త మార్గదర్శకాలను జోన్లవారీగా అమలు చేయనుంది. ఒక నిబంధనను మాత్రం అన్ని జోన్లలో అమలుచేయాలని ఆదేశించింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇళ్లలోనే ఉండాలని, ఇది రెడ్, ఆరెంజ్, గ్రీన్జోన్లలో అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేవలం అత్యవసర సమయాల్లో, ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.