దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ను మే 3వ తేదీ తర్వాత కూడా మరో రెండు వారాలపాటు అంటే మే 17వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోని 733 జిల్లాలను కరోనా వైరస్ ప్రభావం ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా విభజించింది. ఆయా జోన్ల వారీగా లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రెడ్జోన్, ఆరెంజ్ జోన్లో, గ్రీన్ జోన్ల వారీగా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు.. దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలను మాత్రం నో యాక్టివిటీ జోన్ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ , ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ మహా నగరాలను మే 3వ తేదీ తర్వాత కూడా *నో యాక్టివిటీ* జోన్ లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి.. ఈ నగరాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రధానంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం వీటిని నో యాక్టివిటీ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది.