బిగ్ న్యూస్.. అనేక ఊహాగానాలకు తెరపడింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎట్టకేలకు ప్రపంచానికి 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్చిన్లో ఎరువుల కర్మాగారం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్తోపాటూ అతని సోదరి కిమ్ యో జోంగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో చైనా నుంచి కూడా ప్రత్యేక వైద్య బృందం వెళ్లిందని, ఆయన చికిత్స చేసిన తర్వాత పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. కానీ.. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ కిమ్ ఈ ప్రపంచానికి కనిపించారు.