20 రోజులుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అనే ఊహాగానాల‌కు తెర‌దించుతూ ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి కిమ్‌ వ‌స్తున్న‌ప్పుడు తీసిన వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కిమ్ న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జ‌నం జేజేలు ప‌లికారు. కాగా, ఏప్రిల్‌ 15 నుంచి కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన‌ విషయం తెలిసిందే.

 

ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడంతో అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఈ నేపథ్యంలో దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. కిమ్ ఇక లేరంటూ ఒక‌రు.. లేదులేదు బ‌తికే ఉన్నారంటూ మ‌రొక‌రు.. ఇలా అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయి.  ఇదే స‌మ‌యంలో చైనా నుంచి కూడా ప్ర‌త్యేక వైద్య బృందం వెళ్లింద‌ని, ఆయ‌న చికిత్స చేసిన త‌ర్వాత ప‌రిస్థితి విష‌మించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. వీట‌న్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ కిమ్ ఈ ప్ర‌పంచానికి క‌నిపించారు. హాయిగా న‌వ్వుతూ క‌నిపించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: