బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ఇర్ఫాన్ పఠాన్ కన్నుమూసిన మరుసటి రోజే బాలీవుడ్ దిగ్గజం రిషీ కపూర్ ముంబాయి ఆసుపత్రిలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులను, అభిమానుల శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్నుంచి నిష్క్రమించారు. రిషి కపూర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం 4 గంటలకు ముంబయిలోని చందావాడీ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. రిషి కపూర్ భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్, కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ తదితరులు రిషి కపూర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు.
అయితే బాలీవుడ్ లో రిషీ కపూర్ కి మంచి స్నేహితులుగా ఉన్న అమితాబచ్చన్ ఆయనను చివరక్షణంలో చూడలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రిషీ కపూర్ నేను దాదాపు ఒకే సమయంలో మంచి ఫామ్ లోకి వచ్చామని.. ఇద్దరం కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూడటానికి తాను వెళ్లలేదని అమితాబ్ చెప్పారు. రిషీ కపూర్ ఎంత కష్టం ఉన్నా ముఖంపై ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండేవారని.. చివరి క్షణం వరకు రిషి ముఖంపై చిరునవ్వు ఉండే ఉంటుందని... చిరునవ్వుతోనే ఆయన తుదిశ్వాస విడిచి ఉంటారని కన్నీరు పెట్టుకున్నారు అమితాబచ్చన్. కాగా, క్యాన్సర్ తో పోరాడుతూ రిషి కపూర్ ముంబాయి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.