భారత్లో కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేట్ 25శాతానికిపైగానే ఉంది. తాజాగా.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో పసికందు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఒక అధికారి శనివారం తెలిపారు. ఇంతకీ ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందో తెలుసుకుందాం.. ఏప్రిల్ 7న ప్రభుత్వ సుల్తానియా జనన ఆసుపత్రిలో శిశువు జన్మించింది. ఏప్రిల్ 11న తల్లీ బిడ్డలను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. డెలివరీ సమయంలో వైద్యసేవలు అందించిన మహిళా ఆరోగ్య కార్యకర్తకు కరోనా సోకినట్లు ఆ మరునాడు వార్తలు వచ్చాయి.
వెంటనే అప్రమత్తం అయిన శిశువు కుటుంబ సభ్యులు అధికారులను సంప్రదించారు. ఏప్రిల్ 19న ఆ పసికందుకు పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఆమె తల్లికి మాత్రం నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచి శిశువు చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుంది. ఆ చిన్నారిని క్షేమంగా ఇంటికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. *నా కుమార్తె కోలుకొని గత రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆమె గెలిచింది. అందుకే మేము ఆమెకు 'ప్రకృతి' అని పేరు పెట్టాం* అని తండ్రి ఆనందంగా తెలిపారు.