కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా తమిళనాడులో ఏపీకి చెందిన అనేక మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. కాసిమేడు పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో ఉన్న ఏపీ మత్స్యకారులు కనీస సౌకర్యాలు లేక.. తినేందుకు అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈరోజు ఏకంగా కాసిమేడు పోర్టుకు చేరుకుని తమను సొంతూళ్లకు తరలించాలని అధికారులను వేడుకున్నారు. తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయంపై ఏపీ మంత్రి మోపిదేవి స్పందించారు.
తమిళనాడులో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఏపీ సర్కార్ తమిళనాడు ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడుతోందని.. రేపటికల్లా అన్నీ సర్దుకుంటాయని ఆయన అన్నారు. తమిళనాడు నుంచి మత్స్యకారులందరినీ తీసుకొస్తామని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. అయితే.. మత్స్యకారులు అక్కడ చిక్కుకోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.